రూ.2,000 నోట్లు ఉంటే మార్చుకోవాలి.. త్వరలోనే రద్దు..! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.


న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన..రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు.

దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు.

త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు.

కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్‌బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు.

2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు.

రూ.1000,రూ.500 నోట్లను బ్యాన్ చేశారు.

వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు.  అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు.

భారత్‌లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు.

ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు.

అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి,వాటిని బ్యాంకుల్లో మార్చుకు నేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు.