భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో మైనర్ బాలికపై అత్యచారం…


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది.నిన్నటికి నిన్న సంచలనంగా మారిన మదర్సా ఘటన మరువక ముందే మరో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు షురూ చేశాడు ఓ ప్రబుద్ధుడు.అశ్వారావుపేట మండలం, గాండ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధికి చెందిన బాణోత్ ఇందు అనే మైనర్ బాలిక తండ్రి గత కొన్నేళ్లక్రితం మరణించాడు. కాగా బాలిక తల్లి పశ్చిమగోదావరి జిల్లా, తాడువాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తోంది. ఆమెతో పాటుగా తన ఇద్దరు పిల్లలను కూడా తాడువాయి గ్రామానికి తీసుకుని వెళ్ళింది.

ఇక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టాడు ఆ దుర్మార్గుడు.తండ్రి స్థానంలో ఉండి బాలిక భాద్యతలు చూడాల్సిన వ్యక్తి అభంశుభం తెలియని చిన్నారి తో వెకిలిచేష్టలు మొదలుపెట్టాడు. భయపెట్టి,బెదిరించి చిన్నారిని లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. కామాంధుడి వికృత చేష్టల గురించి చిన్నారిని ప్రశ్నించగా బాలిక చెప్పిన విషయాలు విస్మయానికి గురిచేశాయి. తనను ఏకాంతంగా బయటకు తీసుకెళ్లి అసభ్యకరరీతిలో శరీరభాగాల్ని తాకేవాడని,ఎదిరిస్తే విచక్షణా రహితంగా కొట్టేవాడని బాలిక భోరున విలపించింది.వాతలు పెట్టి,వేడినీళ్లు ఒంటిపై పోసి కాల్చడం,వైర్లతో కొట్టడం చేసేవాడని బాలిక తెలిపింది.

అతని అకృత్యాలను తట్టుకోలేక అక్కడ్నుంచి తప్పించుకున్న బాలిక తన తల్లి స్వగ్రామమైన గాండ్లగూడెం చేరుకుని అమ్మమ్మ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది.దీంతో బాలిక అమ్మమ్మ స్థానిక ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది.అక్కడితో ఆగని కామాంధుడు గాండ్లగూడెం గ్రామానికి సైతం వచ్చి బాలికను తనకు అప్పజెప్పాలని పాఠశాల యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురావడంతో అసలు బండారం బయటపడింది. గ్రామస్థులు, బాలిక అమ్మమ్మ,పాఠశాల సిబ్బంది అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రాగా సంఘటన తమ ప్రాంతంలో జరగలేదు కనుక తాము చర్యలు తీసుకోలేమని వెనక్కి పంపారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని,బాలిక తల్లిని భద్రంగా పంపించిన పోలీసులు తీరు సర్వత్రా విమర్శలకు తావునిస్తోంది. చిన్నారులపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడులు జిల్లా ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుని,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

#Prime9News

About The Author