ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం…

ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారి సమీక్ష

ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ

ప్రభుత్వంలో కొత్తగా ప్రజా రవాణాశాఖ ఏర్పాటు ఈ శాఖలోకి ఆర్టీసీ ఉద్యోగులు బస్సు ఛార్జీలు ఇకపై ఫెయిర్‌గా ఉండేలా నిర్ణయాలు  దశలవారీగా ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్‌ బస్సులు

అమరావతి: ఆర్టీసీకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించబోతోంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు కానుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. మాజీ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీ 90 రోజులపాటు అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఇవాళ ( మంగళవారం సాయంత్రం) ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డికి అందించారు. ఈనివేదికలోని పలు అంశాలపై ముఖ్యమంత్రి నిపుణుల కమిటీతో చర్చించారు. రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని, ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రవాణాశాఖ కమీషనర్‌ తిరుమల కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియా ప్రతినిధులకు వివరించారు. 

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌గారి ఆదేశాలమేరకు ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీని నియమించామని మంత్రి పేర్నినాని మీడియా ప్రతినిధులకు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక అందించిందని, 

ఆర్టీసీలో ఉన్నటువంటి  ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపారని చెప్పారు. దీనిమీద ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేసి దానిలోకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ తీసుకొస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపారని పేర్నినాని తెలిపారు.  విధి విధానాలన్నీ కూడా త్వరలోనే ఖరారవుతాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా, అనేక రకాల ఇబ్బందులుపడుతున్నారని, వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. దీనికోసం సుదీర్ఘకాలంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా వారి కల నెరవేరబోతోందని మంత్రి చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయం పై రేపు ప్రభుత్వం నుంచి ప్రకటన రానుందని ఆయన వెల్లడించారు.

సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం ఉందని, ఆ భారాన్నిజగన్మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయాలన్న నిర్ణయం ద్వారా లాభాల బాటలో పరిగెత్తించడమే కాకుండా…. దేశంలో నంబర్‌ వన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌  పోర్ట్‌ గా నిలవాలంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారని పేర్నినాని చెప్పారు. చాలా అంశాల మీద అధ్యయనం జరిగిన తర్వాతే సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తీసుకున్నారని, బస్సు అంటే రాష్ట్ర బస్సే ఎక్కాలనేంత ఆ«ధునికంగా తయారు చేయాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా ప్రవేశపెడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

About The Author