తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం…


తిరుమల, 2019 సెప్టెంబరు 12: తిరుమలలో గురువారంనాడు అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంత‌రం చక్రస్నానాన్ని వైభ‌వంగా నిర్వహించారు. అంతకు మునుపు ఆలయంలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన అనంత పద్మనాభస్వామి వ్రతమునకు సంబంధించిన ఎరుపు పట్టుదారాలను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ధరించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంద‌న్నారు. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతాన్నినిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తుంద‌ని వివ‌రించారు. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో ఈ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించార‌ని తెలిపారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రత్తాళ్వారులకు చక్రస్నానం నిర్వహిస్తార‌ని తెలియ‌జేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్‌ శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

About The Author