అగ‌స్తీశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు…

 

 టిటిడి పరిధిలోని నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 21, 22వ తేదీల్లో ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 20వ తేదీ సాయంత్రం అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.ఇందులోభాగంగా సెప్టెంబ‌రు 21న యాగ‌శాలలో ప‌విత్ర‌మాల‌ల‌కు పూజ‌లు, య‌జ్ఞోప‌వీత స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. అదేవిధంగా సెప్టెంబ‌రు 22న ఉద‌యం పూర్ణాహుతి, ప‌ట్టుప‌విత్రాల స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం శ్రీ అగ‌స్తీశ్వ‌ర‌స్వామివారిని నంది వాహ‌నంపై ఊరేగింపు నిర్వ‌హిస్తారు.ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా పాన‌వ‌ట్టాన్ని అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.

శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో …

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 26, 27వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 25న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.ఇందులోభాగంగా సెప్టెంబ‌రు 26న యాగశాలలో పవిత్రమాలలకు పూజలు, యజ్ఞోపవీత సమర్పణ నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబ‌రు 27న ఉదయం పూర్ణాహుతి యాగశాలపూజ, పట్టుపవిత్రాల సమర్పణ, సాయంత్రం శ్రీ పరాశరేశ్వరస్వామివారిని నంది వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు.

About The Author