కొలువు తీరిన తితిదే పాలకమండలి… పాలక మండలి సభ్యుల మనోగతం…


కొలువు తీరిన తితిదే పాలకమండలి… పాలక మండలి సభ్యుల మనోగతం…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులుగా శ్రీనివాసన్‌‌, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు ప్రమాణస్వీకారం చేశారు.
సోమవారం గరుడాళ్వార్‌ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో జేఈవో బసంత్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి తొలిసమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.
టీటీడీ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శ్రీనివాసన్‌‌, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు మీడియాతో మాట్లాడారు.
‘స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలగటం చాలా సంతోషంగా ఉంది. నాకు పాలకమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నా ధన్యవాదాలు’ అని ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ అన్నారు.
‘శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అనుగ్రహంతో ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. స్వామి వారి అనుగ్రహంతో సామాన్య భక్తులకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు అన్నారు.
బోర్డులో రెండవసారి చోటు దక్కడం తన అదృష్టమని మేడా మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ‘టీటీడీ పాలక మండలిలో మా కుటుంబానికి రెండవసారి చోటు దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాం, దేవస్థానంలో ఎటువంటి అవినీతికి‌ తావులేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తా’ అని మల్లఖార్జున రెడ్డి అన్నారు

About The Author