శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుహనుమంతునిపై వేంకటాద్రిరాముడు

తిరుమల:అక్టోబరు 05, శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

About The Author