హుజూర్‌నగర్ ప్రచారంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్


త్వరలో జరగనున్న హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంపై ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలు, సీనియర్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ప్రచారం తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుజూర్‌నగర్ అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఉత్తమ్ చెబుతున్నారనీ, కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో లేని వారు నిధులెక్కడి నుంచి తెస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ దగ్గర ఏముందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఓడిపోతాయని తెలిసి కూడా కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయం ప్రజలకు చెప్పాలని ఆయన వారికి సూచించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ బలమేంటో తెలిసిపోతుందన్నారు. ఇన్నాళ్ల బీజేపీ మాటలు వట్టి మాటలేనని తేలిపోతుందని మంత్రి అన్నారు. ఇక్కడ బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడం కూడా గొప్పేనని ఆయన అన్నారు. ప్రజల్లో బలం లేదని తెలిసిన బీజేపీ.. కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పని చేస్తోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

About The Author