తిరుమలలో పెరిగిన జలాశయాల‌ నీటిమట్టం…


తిరుమలలోని జలశయాల్లో నీటిమట్టం పెరిగింది. తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌, తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాల్లో క‌లిపి రానున్న 295 రోజుల‌కు స‌రిప‌డా నీటి నిల్వ‌లున్నాయి. శ్రీవారి ఆశీస్సులతో ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 5,047 మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం 2,164 మిలియన్‌ లీటర్ల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 14 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో 700 ఎంసిఎఫ్‌టి(మిలియ‌న్ క్యూబిక్ ఫీట్‌) నీరు నిల్వ ఉంది.

గోగర్భం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 539 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. పాపవినాశనం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 1,128 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 670 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 390 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,312 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3,892 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది

About The Author