చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ…


టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమకుంభారాధన, మండలపూజ, ఉపకుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
ఉదయం 9.00 నుండి మ‌ధ్య‌హ్నం 12.00 గంటల వరకు యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, శ్రీనరసింహస్వామివారు, శ్రీగోదాదేవి అమ్మవారు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ వేణుగోపాలస్వామివారు, శ్రీ అభయ ఆంజనేయస్వామివారు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూపరిండెంట్ శ్రీ కృష్ణారావు, కంకణభట్టర్‌ శ్రీ కృష్ణ బ‌ట్టర్‌, ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస బట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About The Author