శ్రీవారి ఆలయంలో ఘ‌నంగా దీపావళి ఆస్థానం


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం ఘ‌నంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగ‌మోక్తంగా ఆస్థానం నిర్వహించారు.

శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. నూతన పట్టువస్త్రాల‌ను మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్త‌యింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.

ఈ ఆస్థానంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఇన్‌చార్జి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

About The Author