పంతాలకు పోయి బిడ్డను చంపేసింది…


మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహిత.. కుటుంబ కలహాలతో మాతృత్వాన్ని మరిచి తన కుమారుడిని చంపుకుంది. కొంతకాలంగా పుట్టింట్లో ఉంటున్న ఆమె.. కుమారుడిని తన దగ్గరకు పంపాలని భర్త గొడవకు దిగడంతో ఆవేశానికి లోనైంది. అభం శుభం తెలియని కుమారుడికి యాసిడ్‌ తాగించింది. బాలుడు చనిపోవడంతో భయంతో ఆమె సైతం కొంత యాసిడ్‌ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో శనివారం జరిగింది. ఆరేళ్ల క్రితం శివరాణిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలతో నిత్యం ఘర్షణలు జరుగుతుండడంతో.. కుమారుడితో కలిసి ఆమె కన్నవారి ఇంటికి వచ్చింది. దీపావళి పండుగకు రావాలని శివరాణికి భర్త ఫోన్‌ చేసి పిలవగా.. ఆమె రానని చెప్పడంతో తన కుమారుడిని అప్పగించాలని గొడవకు దిగాడు. దీంతో అవసరమైతే కుమారుడిని చంపేస్తా.. కానీ నీ దగ్గరకు పంపేది లేదని చెప్పింది. శుక్రవారం రాత్రి కుమారుడికి మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్‌ తాగించి నిద్ర పుచ్చింది. శనివారం ఉదయం నిద్ర లేచే సరికి కుమారుడు మృతిచెందగా భయంతో ఆమె యాసిడ్‌ తాగి 100కు సమాచారం ఇచ్చింది. శివరాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవ పంచనామా కోసం బాలుడి మృతదేహాన్ని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About The Author