యువతకు ఉపాధి లక్ష్యంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌: మంత్రి శ్రీ కేటీఆర్‌


గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి శ్రీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. దండుమల్కాపూర్‌లో టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్‌ఎంఈ -గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక విధానంలో టీఎస్‌-ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసినవాళ్లే ఇవాళ మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చాం. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్‌ అప్రూవల్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 12 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరిశ్రమల విషయంలో తెలంగాణ అనుసరిస్తోన్న విధానం రేపు దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్‌మోడల్‌ అవుతుంది. ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. 70 శాతం ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలే. ఎంఎస్‌ఎంఈకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నామని చెప్పారు.

పర్యావరణహితంగా గ్రీన్‌ఇండస్ట్రియల్‌ పార్కు..

పర్యావరణహితంగా గ్రీన్‌ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేశామని మంత్రి. శ్రీ కేటీఆర్‌ పేర్కొన్నారు. పరిశ్రమలు తేవడమే కాదు వాటిని పర్యావరణహితంగా మారుస్తున్నాం. 435 ఎకరాల్లో పార్క్‌ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని కోరుతున్నారు. పార్క్‌ విస్తరణకు అవసరమైన భూసేకరణకు వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొనారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును 2వేల ఎకరాలకు విస్తరిస్తాం. పరిశ్రమల కోసం పర్యావరణాన్ని ఫణంగా పెట్టలేం. గ్రీన్‌ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. పార్కులో చాలా స్వల్ప ధరకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి శ్రీ కేటీఆర్‌ తెలిపారు. అంతర్గత రోడ్డు, కరెంట్‌, నీటి వసత వేగంగా పూర్తిచేస్తాం. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు దగ్గర 132 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభిస్తాం. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్‌ పార్క్‌, మైక్రో ప్రాసెసింగ్‌ పార్క్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.

About The Author