ప్రజాసంకల్పయాత్రకు @2ఏళ్ళు


ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో దూసుకెళ్లారు. నేటికి ఈ యాత్ర ప్రారంభమై రెండేళ్లు గడిచింది. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. అంతేకాదు పాదయాత్ర సెంటిమెంట్‌ మరోసారి విజయవంతమయ్యింది. గతంలో వైఎస్, చంద్రబాబులు కూడా ఇలా పాదయాత్రలు చేసి అధికారంలోకి రాగా.. జగన్ కూడా పాదయాత్ర తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజా సంకల్పయాత్రతో వైఎస్సార్‌సీపీ కేడర్‌తో పాటూ ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
ఏకంగా 151 సీట్లతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే ( 2017 నవంబర్‌ 6న) కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ శ్రీకారం చుట్టారు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకొని.. తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మొదటి రోజు నుంచి పాదయాత్రలో నియోజకవర్గాలు, గ్రామాల్లో సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగారు. స్థానిక ప్రజలు.. ముఖ్యంగా నిరుపేదలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలతో మమేమకమయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే..

ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో ప్రధానంగా ఆరు ముఖ్యమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి జరిగిన అన్యాయం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, నిరుపేదలకు ఇళ్లు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలపై స్పందించారు.

అంతేకాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా జగన్ వెనక్కు తగ్గలేదు. మండుటెండలు..

జోరువానలు.. చలిలో ఇలా అన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కాలికి ఇన్ఫెక్షన్లు.. జ్వరం..

తేనెటీగల దాడి.. ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు కలిగినా.. ముందుకు సాగారు. విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి జరిగి..

డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదు.. మొండి ధైర్యంతో ముందుకు నడిచారు. 341 రోజుల పాటూ కొనసాగినా పాదయాత్ర 09-01-2019న ఇచ్ఛాపురంలో ముగియగా.. యాత్ర ముగింపుకు గుర్తుగా లొద్దపుట్టి వద్ద భారీ స్తూపాన్ని జగన్ ఆవిష్కరించారు. పాదయాత్ర హైలెట్స్ కడప జిల్లాలో ప్రారంభమయిన ఆయన యాత్ర, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం చేరుకొంది. ప్రారంభమైన తేది – నవంబర్ 06 2017, ప్రారంభమైన ప్రాంతం – ఇడుపులపాయ కడప, ముగింపు – జనవరి 09 2019, ముగింపు ప్రాంతం – ఇచ్చాపురం శ్రీకాకుళం, పొదయాత్ర కొనసాగిన దూరం – 3,648 కిలోమీటర్లు, పాదయాత్ర జరిగిన రోజులు – 341, యాత్రలో మమేకమైన ప్రజలు – 2 కోట్లు, యాత్ర సాగిన జిల్లాలు – 13, యాత్ర సాగిన అసెంబ్లీ నియోజకవర్గాలు – 134, యాత్ర సాగిన గ్రామాలు – 2,516, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు – 2,500, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు – 1000.

About The Author