ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ వరాలు


ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఏ ఒక్క రూటులోనూ ప్రైవేట్‌ బస్సులకు అనుమతి ఇవ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పారు. నాలుగునెలల్లోనూ ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. ఏటా వెయ్యికోట్ల లాభం రావాలన్నారు. ప్రతి కార్మికుడూ ఏడాదికి రూ.లక్ష బోనస్‌ అందుకునే స్థితికి రావాలని సీఎం కేసీఆర్‌ ఆకాక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో కలిసి మద్యాహ్న భోజనం చేసిన సీఎం కేసీఆర్.. తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైనా సీఎం కేసీఆర్ స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, కంట్రోలర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

సమ్మెకాలానికి వేతనం.. విరమణ వయసు పెంపు

కార్మికులకు 52 రోజుల సమ్మెకాలానికి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సెప్టెంబర్‌ వేతనం సోమవారమే చెల్లించనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పొడిగించనున్నట్లు స్పష్టం చేశారు.

వరాలివే

* ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే.. ఒకే కుటుంబంలా వ్యవహరించాలి.
* ఉద్యోగులకు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం
* సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.
* సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోం.
* కలర్ బ్లైండ్‌నెస్‌ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
* మహిళా ఉద్యోగులకు రాత్రిపూట విధులు వేయొద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
* ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు.
* మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
* మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
* మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేస్తాం.
* రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించం.
* ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు
* ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు. కేవలం హైదరాబాద్‌లోనూ కాకుండా అవసరమైతే ఇతర ప్రాంతాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందేలా చర్యలు
* ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ. మందుల కోసం బయటకు తిప్పవద్దని ఆదేశం.
* ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు
* ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తింపు
* ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు, సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
* డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్‌ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
* ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం
* కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తాం.
* పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.

About The Author