శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో ఇసుకతో చేసిన శివలింగం..


శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో ఇసుకతో చేసిన శివలింగం
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉందని మీకు తెలుసా……?

త్రేతాయుగం నాటి ఆ శివలింగాన్ని ఇప్పుడు మనం చేతులతో తాకినా కూడా
ఇసుక మన చేతులకు అవుతుందనే సంగతి మీకు తెలుసా…….?

ఆ శివలింగం పై శ్రీరామ చంద్రుని చేతి గుర్తులు
ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయని మీకు తెలుసా…….?

అయితే ఆ దేవాలయం విశిష్టతను ఒక్కసారి చదవండి.

పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడిని , శ్రీరామ చంద్రుడు సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది.

దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఒక ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు.

ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుక తో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (=ఇసుక లింగం)గా పేరుగాంచింది.

కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు.

రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడిచి అదృశ్యమైందట.పిల్లి నదిలో దిగిన చోటును “పిల్లి గుండం” అంటారు.

ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.

ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీ రాముడు కాబట్టి దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది.

ముక్తి రామేశ్వరం గా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం కడప జిల్లా లోని ప్రొద్దుటూరు పట్టణం లో ఉంది. ముక్తి రామేశ్వరాలయం పెన్నా నది గా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది.

About The Author