కరోనాను ఎదుర్కోవాలంటే..ఈ 30రోజులే కీలకం?


ప్రపంచవ్యాప్తంగా 145దేశాలకు పాకిన కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌ను కూడా వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదువేల ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ భౌగోళిక పరిస్థితులను కూడా ఖాతరు చేయకుండా విలయతాండవం చేస్తోంది. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ రానున్న రోజుల్లో ప్రమాదం పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిక్రమాన్ని పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైనట్లు అనుమానిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో కూడా చైనాలో విజృంభించిన పద్దతిని అనుసరించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) అభిప్రాయపడింది. ఈ వైరస్‌ వ్యాప్తి చైనాలో అనుసరించినట్లుగానే భారత్‌లో ప్రవర్తించే అవకాశం ఉందని ఐసీఎమ్‌ఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఈ కొవిడ్‌-19 వైరస్‌ సమూహవ్యాప్తి దశ చేరుకునేందుకు కేవలం 30రోజల సమయం మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న అత్యంత కీలకదశలోనే ఈ వైరస్‌ తీవ్రతను అడ్డుకోగలిగితే రాబోయే రోజుల్లో సమూహవ్యాప్తికి చేరకుండా అడ్డుకోవచ్చన్నారు. కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం లేదా వైరస్‌ ప్రభావం ఉన్న దేశాలకు ప్రయాణంచేయని వ్యక్తికి కూడా వైరస్‌ నిర్ధారణ అవడాన్ని సమూహవ్యాప్తి దశగా అభివర్ణిస్తారు. అయితే ఈ దశ దేశంలో ఎక్కడనుంచి ప్రారంభం అవుతుందనే కచ్చితంగా చెప్పలేమని అందుకే ఐసీఎమ్‌ఆర్‌ దేశవ్యాప్తంగా ఉన్న 65 పరిశోధన కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు శాంపిల్స్‌ సేకరిస్తూ పరిశోధనలు చేస్తోంది.

*నాలుగు దశల్లో వైరస్‌ విజృంభణ:*

ఈ వైరస్‌ వ్యాప్తి ముఖ్యంగా నాలుగు దశల్లో ఉంటుందని ఐసీఎమ్‌ఆర్‌ నిపుణులు తెలియజేశారు. *మొదటి దశ-విదేశాలనుంచి ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం, రెండవ దశ- వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందడం, మూడవ దశ-సమూహవ్యాప్తి, కాగా నాలుగవ దశలో ఎపిడమిక్‌గా మారడం జరుగుతుంది.*
ఇలా నాలుగు దశల్లో వైరస్‌ వ్యాప్తి ఉంటుందని, ప్రస్తుతం భారత్‌ రెండవ దశలోనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ దశలోనే వైరస్‌ వ్యాప్తిని కచ్చితంగా అరికట్టగలిగితేనే మూడవ దశకు చేరకుండా ఉండగలం. లేనట్లయితే, మూడద దశను ఎదుర్కొంటున్న ఇటలీ, చైనా, అమెరికా, యూరప్‌ లాంటి పరిస్థితే మనం ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆదశకు చేరడం అనివార్యమైనప్పటికీ ప్రస్తుతం దాన్నుంచి తప్పించుకోవడానికి ఇంకా అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్వక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేయడం వంటి చర్యలు సమూహవ్యాప్తిని అరికట్టగలవని సూచిస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌ రెండవ దశలో ఉందనడానికి ఆగ్రాలో కరోనా సోకిన ఓ వ్యక్తినుంచి వారి కుటుంబంలో మరో ఐదుగురికి సోకడమే నిదర్శనం. కేరళలో నమోదైన కరోనా కేసుల విషయంలోనూ ఇదే నిరూపితమయినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. రెండవదశలో ఉన్న భారత్‌కు తక్షణ ప్రమాదమేమీ లేదని, రాబోయే రోజుల్లో వచ్చే మూడవదశ గురించే ఆందోళన చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక్కసారి ఆ దశను చేరుకున్నట్లయితే దాని తీవ్రత అత్యధికంగా ఉంటుందని..దీంతో చాలా ప్రదేశాల్లో పెద్దమొత్తంలో వైరస్‌ బారిన పడాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో భయాలను సృష్టించడం తమ ఉద్దేశ్యం కాదని, తాము వాస్తవాలను చెప్పడమే తమ వృత్తి ధర్మమని అభిప్రాయపడ్డారు. వైరస్‌ తీవ్రతను ఆపడం సాధ్యం కాదా అనే ప్రశ్నకు బదులిస్తూ.. దీనికోసం వ్యక్తిగతంగా ప్రతిఒక్కరి కృషి, సహకారం ఎంతో కీలకమన్నారు.

ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే, సమూహవ్యాప్తి దశ అనివార్యమైనప్పటికీ నాలుగోదశను చేరకుండా ఉండేదుకు శాస్త్రవేత్తలు నిరంతర కృషి చేస్తున్నారు. ఇప్పటికే వైరస్‌జాతిని గుర్తించిన శాస్త్రవేత్తలు వాక్సిన్‌ అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నారు.

About The Author