ప్రధానమంత్రిగారు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం పలుకుదాం…


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పత్రికా ప్రకటన*

కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దాం. మార్చి 22, ఆదివారం రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని కోరుతున్నాను. ఆరోజు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకూ ప్రజలెవ్వరూ కూడా ఇళ్లనుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు ప్రధాన మంత్రిగారు పిలుపు ఇచ్చినట్టుగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మీమీ ఇళ్ల బాల్కనీల వద్దకు, ద్వారాల వద్దకు వచ్చి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి, ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తున్నవారికి మద్దతుగా 5 నిమిషాలసేపు నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ వారికి మద్దతు తెలపాలి. దీనికి సంకేతం ఇవ్వడానికి సరిగ్గా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీమీ ప్రాంతాల్లో స్థానిక అధికారులు సైరన్‌ మోగిస్తారు. అందుకు అందరూ సమాయత్తంగా ఉండాలని, ప్రయాణాలు, పనులు ఆరోజు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, విద్యుత్తు, అగ్నిమాపక సిబ్బంది, పాలు లాంటి నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా స్వచ్ఛందంగా నిలిపేయాలని కోరుతున్నాను. కోవిడ్‌ –19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సోషల్‌డిస్టెన్స్‌ను పాటించడానికి జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఇది ఒక ప్రారంభంగా భావిద్దాం. కోవిడ్‌ –19 మహమ్మారి నివారణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం ముందు ఉంటుందని చాటుదాం.

ఇట్లు
వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

About The Author