చిత్తూరులో క్వారంటైన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ దుర్మరణం

చిత్తూరుజిల్లా : కలికిరి క్వారంటైన్‌కు కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్‌ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో వాహన డ్రైవర్‌ (పైలెట్‌) అక్కులప్ప (25) అక్కడికక్కడే మృతి చెందాడు. కలికిరి సమీపంలోని సత్యాపురం వద్ద గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అనుమానితులుగా గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తీసుకు రావడం, క్వారంటైన్‌లో డిశార్జి అయిన వారిని తిరిగి వారి ఇళ్ళకు చేర్చడం, ఇతర పరిశీలనల కోసం అవసరమైతే తిరుపతి ఆస్పత్రికి తీసుకుపోవడం వంటి పనుల కోసం ఈ వాహనాన్ని కేటాయించారు.

గురువారం మదనపల్లె నుంచి దాదాపు 30 శాంపిళ్ళను తీసుకుని తిరుపతిలో అప్పగించి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఎడమ వైపున వున్న చింత చెట్టును ఢీకొనడంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో అక్కులప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ అక్కులప్ప ఒక్కడే వున్నాడు. రొంపిచెర్లకు చెందిన అక్కులప్పకు భార్య, మూడు రోజుల క్రితమే జన్మించిన కుమార్తె వున్నారు. శుక్రవారం కలికిరి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కలికిరి ఎస్‌ఐ రామాంజనేయులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

About The Author