హైదరాబాద్‌లో ఇదే ఫస్ట్… ఒకే కుటుంబంలో 17 మందికి పాజిటివ్..


వరుసగా రెండు రోజులు నమోదు అవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుంటే.. ఇది స్పష్టంగా కనిపిస్తోంది.. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు సంఖ్య వణుకుపుట్టిస్తోంది… పాతబస్తీలో నివాసం ఉండే ఓ కుటుంబంలోని 17 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. వీరిలో పది నెలల శిశువుకూడా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు.. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మిగతా 24 మందిని కూడా ఆస్పత్రిలో క్వారెంటైన్‌కు తరలించారు. ఇక, మృతిచెందిన మహిళ వయసు దాదాపు 60 ఏళ్లు.. గుండెకు సంబధించిన సమస్యతో ఆమెను ఏప్రిల్ 9న నాంపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. గాంధీ ఆస్పత్రి ప్రస్తుతం కరోనావైరస్ చికిత్సకు కేంద్రంగా మారడంతో, అక్కడి నుంచి ఆ మహిళను కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు దాదాపు నాలుగు గంటల పాటు చికిత్స అందించారు. పరిస్థితి క్రిటికల్‌గా మారటంతో, అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కు పంపారు. ఉస్మానియాలో కూడా కొన్ని గంటల సేపు చికిత్స చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ వెంటిలేటర్ అందుబాటులో లేనందున ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాలని డాక్టర్లు ఆ కుటుంబానికి సూచించారని అధికారులు తెలిపారు. దాంతో, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇంతలోనే ఆ మహిళ మరణించారు. మరుసటి రోజు టెస్ట్ ఫలితాలు వచ్చాయి. ఆమెకు కోవిడ్ సోకిందని వైద్యులు ధ్రువీకరించడంతో అధికారులు మిగతా కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా, ఆమెకు చివరగా చికిత్స అందించిన ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వాటి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ఘటన కలకలం రేపుతోంది.

About The Author