రిమోట్‌ యాప్‌లతో ఖాతాలు ఖాళీ..!


* రూటు మార్చిన జార్ఖండ్‌ సైబర్‌ మోసగాళ్లు
* ఓటీపీకి స్పందన లేకపోవడంతో కొత్తరూటు
* సైబరాబాద్‌లో ఐదు నెలలో 20 కోట్లు లూటీ

ఓటీపీ అనగానే ఇప్పుడు చాలామంది ఫోన్‌ కట్‌ చేస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు కొత్తరూటు ఎంచుకున్నారు. ఓటీపీ సైబర్‌ దొంగలుగా పేరొందిన జార్ఖండ్‌ ముఠా సభ్యులు ఇప్పుడు రిమోట్‌ యాప్‌లతో దోచేస్తున్నారు. ఎనీడెస్క్‌ యాప్‌, టీమ్‌ వ్యూయర్‌ యాప్‌, క్విక్‌ సపోర్టుతో పాటు మరికొన్ని రిమోట్‌ యాప్‌లను తమ చోరీలకు అస్ర్తాలుగా వాడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. సార్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి మాట్లాడుతున్నా. మీ ఫోన్‌ సేవలు కొద్దిసేపట్లో నిలిచిపోతాయి. ఇందుకు మీరు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలన్నాడు. మీరు జస్ట్‌ క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. మిగతాది మేము చూసుకుంటాం.. అన్నారు. అప్పటికే సుధాకర్‌కు కొన్ని ముఖ్యమైన కాల్స్‌ వచ్చేవి ఉండటంతో ఓకే అన్నాడు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అతనికి ఐడీని కూడా చెప్పేశాడు. సార్‌ మీరు ఎవరికైనా ఓ రూపాయిని ట్రాన్స్‌ఫర్‌ చేయండని చెప్పాడు. అలా పది నిమిషాలు గడిచిందో లేదో.. సుధాకర్‌ ఖాతా నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఖంగుతిన్న సుధాకర్‌.. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఐడీ ఇవ్వగానే దాంతో పార్టనర్‌గా మారిన సైబర్‌ క్రిమినల్‌.. రూపాయి బదిలీ చేయమన్నప్పుడు సుధాకర్‌ యూపీఐ పిన్‌నెంబర్‌, పాసు వర్డును తెలుసుకొని మరుక్షణమే లక్ష రూపాయలు కొట్టేశాడు. ఇలా ఒక సుధార్‌ కాదు.. చాలామంది ఇటీవల రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ ఖాతాలను గుల్ల చేసుకున్నారు. ఇలా ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే గత ఐదు నెలలో వివిధ సైబర్‌ క్రైం అంశాలకు సంబంధించి బాధితులు రూ.20 కోట్లు పోగొట్టుకున్నారు.

*రిమోట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే ఏమైతదంటే..:-* కంప్యూటర్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండే నిపుణులు రిమోట్‌ యాప్‌ల ద్వారా వాటిని పరిష్కరించేవారు. ఉదాహరణకు ఇండియాలో ఉన్న కార్పొరేట్‌ సంస్థ కంప్యూటర్లలో ఏ సమస్య వచ్చినా, లేదా పని పురోగతి తెలుసుకోవడానికి ఈ యాప్‌లను వినియోగించేవారు. రిమోట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఒక ఐడీ వస్తుంది. దానిని మనం అవతలి వారికి చెప్తే వారు ఆ ఐడీని కాపీచేసుకుని పార్టనర్‌గా మారి మన కంప్యూటర్‌ను ఇతర ప్రాంతం నుంచి చూస్తారు. ఇది సాంకేతికంగా ఐటీ పరిశ్రమలో చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీనిని జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్లు తమ నేరాలకు అనువుగా మార్చు కుంటున్నారు. వాటిని డౌన్‌లోడ్‌ చేయించి మన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌లను వారి ఆధీనంలోకి తెచ్చుకుని మన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ బ్యాంక్‌ ఐడీలను తెలుసుకుని ఖాతాల్లో డబ్బును దోచేస్తున్నారు.

*యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎవరూ చెప్పరు:-* ఏ బ్యాంక్‌, ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పవు. ఉన్నత విద్యావంతులతో పాటు ఫోన్‌పై అవగాహన ఉన్నవారిని సైతం సైబర్‌ మాయగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. అదే సాధారణ ఫోన్లు వాడి కొంచెం తెలివిగా ఉండే వారిని వీరు మోసం చేయలేపోతున్నారని మా అధ్యయనంలో తేలింది. ఏటీపీలు, రిమోట్‌ యాప్‌ల ఐడీ చెప్పొద్దు. కేవైసీలు అన్నా పట్టించుకోవద్దు. ముఖ్యంగా హిందీలో మాట్లాడి మేము అధికారులమంటే అది సైబర్‌కాల్‌గా అనుమానించాలి. భాష యాసను గుర్తుపట్టండి. వచ్చి రాని ఆంగ్లం, ఉత్తరాది యాసలో హిందీ బాషలో మాట్లాడిన వారికి సమాధానం ఇవ్వకుండా ఫోన్‌కట్‌ చేయాలి.
– *సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌, ఏసీపీ సైబరాబాద్‌*

About The Author