గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రస్తుతం విద్యార్ధులందరూ విద్యను ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్ధులు చదువుతుండగా.. వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో మిగిలిన విద్యార్ధులకు ఆన్‌లైన్‌ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే విశాఖపట్నంలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరిశుభ్రత, పచ్చదనం మైంటైన్ చేస్తూ.. తొలిస్థానంలో నిలిచే గురుకులానికి రూ. 50 వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ. 30 వేలు ప్రోత్యాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

 

About The Author