ఇంటిని లారీలో తెచ్చి.. క్రేన్‌తో నిలబెట్టారు !


తెలంగాణ
పెబ్బేరు రూరల్‌ : సాధారణంగా ఒక‌ ఇల్లు నిర్మాణం పూర్తికావ‌డానికి చాలా రోజులు ప‌డుతుంది. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇల్లు మాత్రం అలా కాదు. ఎక్కడో నిర్మించిన ఇంటిని తీసుకొచ్చి ఇలా నిలబెట్టారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె వద్ద రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన సత్యన్న అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో ఆరడగుల ఎత్తున తొమ్మిది పిల్లర్లను నిర్మించారు. హైదరాబాద్‌లోని కొంపల్లి పక్కనున్న దూల‌ప‌ల్లిలో త‌యారు చేసిన‌ ఫ్యాబ్రికేటెడ్‌ మొబైల్‌ ఇంటి(హౌస్‌)ని ఆదివారం లారీలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చాడు.

రెండు క్రేన్‌ల సాయంతో ఆ ఇంటిని ఇక్కడ నిర్మించిన ఆరు పిల్లర్లపై నిలబెట్టారు. 25 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు ఉన్న ఆ ఇంట్లో అని వసతులు ఉన్నాయి. హాలు, బెడ్రూం, వాష్‌రూం, కిచెన్‌ వంటి సౌకర్యాలు ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు. అలాగే, ముందు భాగంలో మరో ఆరడుగుల బాల్కానీ కూడా ఉంది. అంటే ఇంటి సైజు 50 చదరపు గజాలు ఉంటుంది. రూ.7.50 లక్షల వ్యయం అయ్యిందని తయారీదారులే లారీలో తెచ్చి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారని ఫాం హౌస్‌ నిర్వాహకుడు భరత్‌ తెలిపాడు.

కాగా, పిల్లర్ల నిర్మాణానికి మరో రూ.50 వేలు అయినట్లు తెలిసింది. దీంతో మొత్తం ఈ ఇంటి ఖర్చు రూ.8 లక్షలు . అయితే ఇక్కడ అవసరం తీరాక మళ్లీ ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించే వెసులుబాటు ఉంది. హైవే- 44 సమీపంలో ఈ ఇల్లు ఉండటంతో ప్రయాణికులు ఆ ఇంటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

About The Author