ఒకే విధానంలో డిగ్రీ ఫీజులు: ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు

ప్రభుత్వ కాలేజీలతో చూస్తే ప్రైవేటు డిగ్రీ కళాశాలలే ఎక్కువ. వీటిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫీజులు వసూలు చేస్తుంటారు. మా కాలేజీ గొప్పంటే మా కాలేజీ గొప్ప అని విద్యార్ధులపై ఫీజులను బాదుతుంటారు. దీనివల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోంది. దీన్ని సవరించేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అన్ని కళాశాలల్లో ఒకే విధానంలో ఫీజులు ఉండేలా రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమీషన్ కాలేజీలను బట్టి ఎంత ఫీజు ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. దీని ఆదారంగా ఫీజులను నిర్ణయించి, వాటినే విద్యార్థుల నుంచి వసూలు చేసేలా ఏర్పాటు చేస్తోంది.

ఏపీ సీఎం జగన్ విద్యా వ్యవస్థపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్.. ఈ అకడమిక్ ఇయర్ (2020-21) నుంచి ప్రవేటు డిగ్రీ కళాశాలల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. 2020-21 అకడమిక్ ఇయర్ నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఫైనల్ చేసేందుకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రెడీ అవుతుంది. రెగ్యూలర్ డిగ్రీ కోర్సులకు పలు కాలేజీలు వసూలు చేస్తోన్న ఫీజుల్లో ఎక్కువ వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు మేలు చేకూర్చేలా.. కమిషన్‌ ఏకరూప ఫీజు ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరో 10 రోజుల వ్యవధిలోనే కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియను కమిషన్ కంప్లీట్ చేయనుంది. ఏపీలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉండగా.. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్ ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, గవర్నమెంట్ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్ (సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రవేట్‌ అన్ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం మొదటిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను ఫైనల్ చేయనుంది. ఒకే విధానంలో ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు ఆప్షన్స్ పరిశీలనలో ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం. లేదా.. కళాశాలలను రెండు లేదా మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఫీజులను నిర్ణయించడం. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

About The Author