చిన్నారి దీక్షిత్ ను నిందితుడు ఎలా చంపిందీ వివరించిన పోలీసులు…


మహబూబాబాద్ పట్టణంలో 9 ఏళ్ల దీక్షిత్ అనే బాలుడి కిడ్నాప్ వ్యవహారం విషాదాంతం కావడం అందరినీ కలచివేస్తోంది. దీక్షిత్ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం. కాగా, దీక్షిత్ ను కిరాతకంగా హత్యచేసిన మంద సాగర్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఘటన వివరాలను ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. మంద సాగర్ ఒక్కడే ఈ కిడ్నాప్, హత్య వ్యవహారంలో నిందితుడని వెల్లడించారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

“ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సాగర్ బైక్ పై వచ్చి దీక్షిత్ ను ఎక్కించుకున్నాడు. కొన్ని వస్తువులు కొనుక్కుని మళ్లీ వచ్చేద్దాం అని చెప్పి దీక్షిత్ ను ఒప్పించాడు. సీసీ కెమెరాలు లేని మార్గంలో తన బైక్ నడిపించాడు. అన్నారం వద్ద ఉన్న దానమయ్య గుట్టపైకి బాలుడ్ని తీసుకెళ్లాడు. అయితే చీకటిపడుతుండడంతో దీక్షిత్ ఏడవడం ప్రారంభించాడు. దాంతో సాగర్ అప్పటికే తనతో తెచ్చుకున్న మత్తు మాత్రను నీటితో కలిపి బాలుడికి ఇచ్చాడు. ఆ చిన్నారిని నమ్మించేందుకు తాను కొద్దిమోతాదులో నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగాడు.

నిద్రమాత్ర ప్రభావంతో దీక్షిత్ కాసేపటికే స్పృహకోల్పోయాడు. కర్చీఫ్ తో ఆ బాలుడి చేతులు కట్టేసి, టీషర్ట్ తో ఉరేసి చంపాడు. అనంతరం రాత్రి 9.15 గంటలకు దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.45 లక్షలు డిమాండ్ చేశాడు. కాసేపటి తర్వాత ఏమీ ఎరగనివాడిలా పట్టణంలోకి వచ్చాడు. అప్పటికే దీక్షిత్ కనబడని విషయం తెలిసిపోయింది. దాంతో తన విషయం బయటికి రాకుండా ఉండేందుకు లీటర్ పెట్రోల్ కొనుక్కుని వెళ్లాడు. మళ్లీ గుట్టపైకి చేరుకుని బాలుడి మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు” అని వివరించారు. మిగతా వారికి ఈ ఘటనతో సంబంధంలేదని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ కిడ్నాప్, మర్డర్ కేసులో నిందితుడు మంద సాగర్ ది మొదటి నుంచి నేర వైఖరేనని తెలుస్తోంది. అతడికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

9 ఏళ్ల దీక్షిత్ ను కిడ్నాప్ చేసి హత్యచేసిన సాగర్… బాలుడి తల్లికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు. అతడు డిమాండ్ చేసినట్టుగానే బాలుడి తండ్రి డబ్బుతో చౌరస్తా వద్ద సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో తన షాపు వద్దకు వచ్చిన సాగర్.. ఏమీ తెలియనివాడిలా రంజిత్ రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీసే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే విపరీతమైన టెన్షన్ తో ఉన్న రంజిత్ రెడ్డి అక్కడ్నించి వెళ్లిపోవాలంటూ సాగర్ తో చెప్పాడు. అప్పటికి సాగరే కిడ్నాపర్ అని వారికి తెలియదు. ఆ సమయంలో అక్కడ కొందరు మఫ్టీ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వారి ఎదురుగానే తాను ధీమాగా తిరగ్గలుగుతున్నాని, పోలీసులను వెర్రివాళ్లను చేయగలిగానని భావించి సాగర్ నవ్వుకున్నాడట.

అయితే, రంజిత్ రెడ్డి తీసుకువచ్చిన రూ.45 లక్షల నగదులో కొన్ని దొంగనోట్లు ఉండొచ్చని తన షాపు వద్ద నిల్చున్న కొందరి మాటలతో సాగర్ లో అనుమానం మొదలైంది. దాంతో మళ్లీ రంజిత్ కు ఫోన్ చేసి ఆ నోట్లు తనకు స్కైప్ వీడియో కాల్ ద్వారా చూపించాలని డిమాండ్ చేశాడు. అప్పటివరకు ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ చేస్తూ పోలీసులకు దొర్కకుండా తప్పించుకున్న సాగర్… చివరికి నోట్లు పరిశీలనగా చూసేందుకు స్కైప్ కాల్ చేసి దొరికిపోయాడు. స్కైప్ లో అతడి ఫోన్ నెంబర్ డిస్ ప్లే కావడంతో పోలీసులు టెక్నాలజీ సాయంతో పరిశోధించి ఇదంతా చేసింది మెకానిక్ మంద సాగరేనని గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, నిందితుడు సాగర్ ఇద్దరు బావలు పోలీసు డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారికంటే ఎక్కువ సంపాదిస్తానని చాలెంజ్ లు చేస్తూ, తన మాట నిలబెట్టుకోవడం కోసం చివరికి కిడ్నాప్ కు పాల్పడి అన్నెపున్నెం ఎరుగని బాలుడ్ని అంతమొందించాడు. టెక్నాలజీపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శించే సాగర్… ఏడాది కిందట ఓ ఇజ్రాయెలీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని సాయంతో ఓ యువతిని వేధించాడు.

కాగా, ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ తో ఎవరికీ దొరక్కుండా కాల్స్ చేయవచ్చని సాగర్ ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడట. సాగర్ ను ఆటపట్టించేందుకు ఆ మిత్రుడు ఇంటర్నెట్ కాల్ చేయగా, తదనంతరకాలంలో ఆ ఇంటర్నెట్ కాలింగ్ పైనే సాగర్ విశేషమైన పట్టు సాధించాడు. చదివింది ఇంటరే అయినా ఓ సైబర్ క్రిమినల్ కు ఉండాల్సిన తెలివితేటలు ఉన్నాయన్నది ఈ విషయాల ద్వారా వెల్లడవుతోంది.

స్థానిక శనిగపురంలో నివసించే సాగర్… గతంలో ఓ అమ్మాయితో పెళ్లి కుదరగా, ఆ అమ్మాయిని ఊరి శివారుకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించి పెళ్లి చెడగొట్టుకున్నట్టు తెలుస్తోంది. కొన్నిరోజుల కిందటే తాత చేయి విరగ్గొట్టాడట. సాగర్ ఇంతకుముందు పోలీసు వాహనానికి డ్రైవర్ గా పనిచేసి రెండేళ్లుగా సొంత మెకానిక్ షాపు నడుపుకుంటున్నట్టు తెలిసింది.

About The Author