ఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్..


సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా దాదాపు అరగంట పాటు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురితో జరిగిన భేటీలో రాష్ట్రంలోని దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నిన్న కేంద్ర మంత్రులు, అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

About The Author