బండి సంజయ్ రైల్వేప్రాజెక్టుల కొరకు వినతిపత్రం…


కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రైల్వేప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల విషయమై బుధవారం దిల్లీలో ఇండియన్ రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో శ్రీ సునీత్ శర్మ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
కరీంనగర్ లోని తీగలగుట్టపల్లీ దగ్గర LC no.18 (T) వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహన రద్దీ పెరగడంతో లెవల్ క్రాసింగ్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సత్వరమే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని శ్రీ సునీత్ శర్మ గారిని కోరాను. దక్షిణ మధ్య రైల్వే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపిందని, దీన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి పరిష్కరించాల్సిందిగా కోరాను. అలాగే LC no.26 కొత్తపల్లి నుంచి గంగాధర (రామడుగు గేట్) వైపుగా వెళ్లే మార్గంలో రైల్వే క్రాసింగ్ ను రద్దు చేసి ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేదుకు దోహదపడాలని కోరాను.
పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట్-పెద్దపల్లి మార్గంలో బైపాస్ లైన్ నిర్మాణం చేపట్టాలని విన్నవించాను. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని, నిధుల లభ్యతను బట్టి ముందడుగు వేయాలన్నాను. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి రూ.325 కోట్ల కేటాయించగా, వాటి పనులు వేగవంతం చేయాలని కోరాను. రాజధానిని అనుసంధానించే మార్గం కారణంగా సత్వరమే ఈ పనులు పూర్తిచేయాలని, రెండేళ్ల కాలవ్యవధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ మందకొడి పనుల కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించాను. కరీంనగర్ – హసన్ పర్తి వయా హుజూరాబాద్ మీదుగా మధ్య కొత్త లైన్ నిర్మాణం సర్వే పనులకు గతంలోనే మంజూరయ్యాయని, ఈ లైన్ కు ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత బడ్జెట్ లో ఈ లైన్ కు కేటాయింపులు జరగలేదని తెలిపాను. దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రాబోయే సప్లిమెంటరీ బడ్జెట్ లోనైనా ఈ లైన్ కు తగిన నిధులు కేటాయించేలా చూడగలరని విజ్ఞప్తి చేశాను.కరీంనగర్ నుంచి చెన్నై, ముంబై, షిరిడి సహా దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను నడిపించాలని కోరాను. కరీంనగర్ రైల్వే స్టేషన్ లో లిఫ్ట్, ఎస్కలేటర్లతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మరొక ప్రవేశ ద్వారం, లోడింగ్-అన్ లోడింగ్ వసతులు, మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్సు నిర్మించాలన్నాను. దీనిపట్ల శ్రీ సునీత్ శర్మ గారు సానుకూలంగా స్పందించారు.

About The Author