జిల్లాలో అమానుష ఘటన జరిగింది…ఎస్ఐ అన్నంలో పేడ, మట్టి కలిపాడు


అనంతపురం: జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ భావిస్తుంటే.. ప్రజలను రక్షించే బాధ్యతలో ఉన్న ఓ ఎస్ఐ అన్నంలో పేడ, మట్టి కలిపాడు. అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం గంగవరంలో మంగళవారం ఈ అమానుష ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న దళితులు ప్రచారం మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా బెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాషా అక్కడి వచ్చారు. అనుమతి లేకుండా ఇక్కడ ఎలా వంట చేస్తున్నారంటూ దళితులపై మండిపడ్డారు. ఎవరి అనుమతిలో వంట చేశారంటూ పరుష పదజాలంతో దూషించారు. అంతటి ఆగకుండా తనలోని క్రూరత్వాన్ని బయటపెడుతూ తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం, కూరలో పేడ, మట్టి, బొగ్గులు వేశాడు. ఎస్ఐ చర్యతో అక్కడున్నవారు షాకయ్యారు. దాదాపు 200 మంది కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని ఎస్ఐ ఇలా వృధా చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే వైసీపీ నేతలు కూడా విందు ఏర్పాటు చేసుకున్నారని, అయితే ఎస్ఐ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, కావాలనే తమ ఆహారాన్ని పాడు చేశారని ఆరోపించారు. ఎస్ఐ వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

About The Author