చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర…


రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ
వైఎస్‌ పాదయాత్ర మొదలుపెట్టిందీ అదేరోజు
కార్యాలయాన్ని మరో చోటికి మార్చే యోచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10,ఏప్రిల్‌ 10.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులకు చాలా ముఖ్యమైన రోజు. 2003లో ఇదే రోజున ఆయన చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర.. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బాటలు వేసింది. ఇప్పుడు మరోసారి ఏప్రిల్‌ 10వ తేదీ.. మరో కీలక ఘట్టానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కూతురు షర్మిల తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును అదేరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
లేదంటే అదే రోజు, అదే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రారంభించిన ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్‌ మొదటివారం కల్లా పూర్తి చేయాలని షర్మిల బృందం ప్రాథమికంగా నిర్ణయించడమూ ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. వచ్చే ఏప్రిల్‌ 10 నాటికి చేవెళ్లలో వైఎస్సార్‌ ప్రారంభించిన పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పార్టీకి సంబంధించి కీలక కార్యక్రమాన్ని అదే రోజు షర్మిల పెట్టుకోనున్నట్లు చెబుతున్నారు. ఈలోపు నిర్వహించే ఆత్మీయ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా పార్టీ విధి విధానాలు, జెండాను నిర్ణయించాలన్న ఆలోచనలోనూ షర్మిల బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో వీటికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జిల్లాలకు వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు..

వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాల విషయం చర్చించేందుకు షర్మిల బుధవారం లోటస్‌ పాండ్‌లో తన సన్నిహితులతో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమ్మేళనాలను ఏప్రిల్‌ మొదటివారం కల్లా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు నగరంలోనే నిర్వహించాలని, దూరంగా ఉన్న జిల్లాలకు మాత్రం స్వయంగా వెళ్లి నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నెల 21న ఖమ్మం లేదా ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ సమ్మేళనం ఉంటుందని, ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక జిల్లా సమావేశం ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమ్మేళనం పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, లోటస్‌ పాండ్‌లో సమావేశాలకు అనుకూలంగా లేకపోవడంతో నగరంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలను మరో చోట కార్యాలయం ఏర్పాటు చేసుకుని నిర్వహించాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.

ఘనంగా అనిల్‌ పుట్టినరోజు వేడుకలు

వైఎస్‌ షర్మిల భర్త అనిల్‌ పుట్టినరోజు వేడుకలు బుధవారం లోట్‌సపాండ్‌లో ఘనంగా జరిగాయి. వైఎస్‌ అభిమానులు, క్రిస్టియన్‌ మతపెద్దలు, సన్నిహితులు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, షర్మిల పార్టీ పెట్టనున్నట్లు స్పష్టత వచ్చిన నేపథ్యంలో బుధవారం కూడా లోట్‌సపాండ్‌ వద్ద అభిమానుల సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఆ ప్రాంతం కళకళలాడింది.

About The Author