సిల్క్‌స్మిత బ‌యోపిక్‌లో వివాదాస్ప‌ద న‌టికి లీడ్‌రోల్‌


దివంగ‌త న‌టి సిల్క్‌స్మిత జీవిత క‌థ ఆధారంగా డైరెక్ట‌ర్ మ‌ధు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న బ‌యోపిక్‌లో వివాదాస్ప‌ద న‌టి శ్రీ‌రెడ్డికి లీడ్ రోల్ ద‌క్కింది. ఈ విష‌యాన్ని శ్రీ‌రెడ్డే త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా గుడ్ న్యూస్ చెబుతానంటూ శ్రీ‌రెడ్డి అభిమానుల‌ను ఊరిస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆ స‌స్పెన్స్‌కు తెర‌దించారామె.
సిల్క్‌ స్మిత బయోపిక్‌ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఆమె కోరుకుంటూ పోస్టు చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్ ఎపిసోడ్‌తో శ్రీ‌రెడ్డి పాపుల‌ర్ అయ్యారు. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ను నిర‌సిస్తూ ఆమె ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఏకంగా అర్ధ‌న‌గ్నంగా నిర‌స‌న‌కు దిగి తీవ్ర దుమారం రేపారు.
కార‌ణాలేవైనా టాలీవుడ్‌లో ఆమెకు ఆశించిన‌ట్టుగా ఆఫ‌ర్లు రాలేదు. దీంతో శ్రీ‌రెడ్డి త‌న మ‌కాంను చెన్నైకి మార్చారు. ఈ నేప‌థ్యంలో సిల్క్‌స్మితతో త‌న‌ను తాను పోల్చుకుంటూ ఆమె ఓ ఫొటోను కూడా విడుద‌ల చేశారు.
ఇదిలా ఉండ‌గా సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో యాంక‌ర్ అన‌సూయ కీరోల్ పోషిస్తార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగింది. ఆ ప్ర‌చారాన్ని ఆమె కొట్టి పారేశారు. తాజాగా శ్రీ‌రెడ్డి తానే ఆ లీడ్‌రోల్ పోషిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.
కాగా బాలీవుడ్‌లో 2011లో డర్టీ పిక్చర్‌ పేరుతో తెర‌కెక్కిన‌ సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించారు. ఆ పాత్ర ఆమెకి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది.

About The Author