వాహనమిత్ర సాయం అక్టోబరు 1న…


*గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణ*

*17 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్,డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి*

*మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం*

అమరావతి: ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర కింద రూ.15,000 ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.

వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి.

ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి/రేషన్ కార్డు కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.

ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కిస్తారు.

వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.

మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.

*కొత్త దరఖాస్తుల స్వీకరణ 17 నుంచి*

ఈనెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో కూడిన వివరాలను ప్రభుత్వం జీఎస్ఈడబ్ల్యూఎస్కు అందిస్తుంది.

తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్ఈబ్ల్యూఎల్డీ) ఈనెల 17న నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తుంది.

కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19 వరకు అవకాశం కల్పిస్తారు.

ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు. తుది జాబితా 24కు సిద్ధమవుతుంది.

లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జీఎస్ఈబ్ల్యూఎస్ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది.

ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబరు 1న బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.

About The Author