చంద్రబాబు పాలనలో 25ఏళ్లు వెనక్కి: షర్మిల


చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, షర్మిల అన్నారు.  సోమవారం అమరావతిలో ఆమె మంగళగిరి నియోజకవర్గ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తో కలిసి మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని వైఎస్‌ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు… రైతులను మోసం చేశారని విమర్శించారు.  మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు…తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ‘ నేను వైఎస్సార్‌ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూత‌ద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసుకుంటూ పాల‌న సాగించారు. మ‌హానేత వైఎస్సాఆర్ హ‌యాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఉండేది. ప్ర‌తి వ్య‌క్తికి ఉపాధి ఉండేది. పేద‌ విద్యార్థి గొప్ప‌ చ‌దువులు ఉచితంగా చ‌దువుకునేలా పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ ఉండేది. కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు ఆఖ‌రికి పార్టీల‌కు కూడా అతీతంగా ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్‌ ప్ర‌తి వ‌ర్గానికి మేలు చేసిన నాయ‌కుడు.’  అన్నారు.

About The Author