ఏప్రిల్ 14న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం… ఏప్రిల్ 15న‌ శ్రీరామపట్టాభిషేకం…

ఏప్రిల్ 14న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం…
ఏప్రిల్ 15న‌ శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 14వ తేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు  శ్రీమలయప్పస్వామివారు హనుమద్వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో  ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామ పట్టాభిషేకాన్ని టిటిడి అత్యంత వైభవంగా నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

కాగా రాత్రి  10.00  నుండి 11.00 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

ఏప్రిల్ 15వ తేదీ సోమవారం రాత్రి 8.00 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా నిర్వహించే ఈ రెండు కార్యక్రమాలలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 15వ తేదీ శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవలు యదావిధిగా కొనసాగుతాయి…

About The Author