అదుపులో ముగ్గురు వ్యక్తులు..
కొనసాగుతున్న విచారణ..
ఐసిస్‌తో సంబంధాలున్నాయని అనుమానం..

ఐసిస్‌ ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారంతో కేరళలో మూడు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం సోదాలు చేపట్టింది.

ఐసిస్‌తో సంబంధాలున్నాయని భావిస్తున్న ముగ్గురు అనుమానితులను పాలక్కడ్‌, కాసర్‌గోడ్‌ ప్రాంతాల్లోని మూడు ఇళ్ల నుంచి వేర్వేరుగా ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.

వీరు ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తి కనబర్చారని, ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయనే సమాచారం ఉందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వీరి నుంచి చరవాణులు, సిమ్‌ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

‘‘స్వాధీనం చేసుకున్న వాటిలో అరబిక్‌, మలయాళం భాషల్లో రాసిన కాగితాలు గుర్తించాం.

ముస్లిం మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ సీడీలు ఉన్నాయి. పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సికల్‌గా పరీక్షించి విశ్లేషించాల్సి ఉంది.’’ అని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

21 మంది మాయం..

కేరళలో 21 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒకేసారి కనిపించకుండా పోయిన ఘటనపైనా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. వీరు ఆ సమయంలో ఐసీస్‌లో చేరి శిక్షణ పొంది ఉంటారని అనుమానిస్తున్నారు.

కనిపించకుండా పోయిన 21 మందిలో 17 మంది కాసర్‌గోడ్‌ నుంచి కాగా నలుగురు పాలక్కడ్‌ వాసులు. ఈ 21 మందిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

About The Author