శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు.

శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’.
శివుడు అభిషేక ప్రియుడు.

హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.
ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.

ధారాభిషేకం:
కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.
ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం:
జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి.
ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం:
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’.
తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం:
చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి.
శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం:
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం.
ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు
లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం:
ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి.
లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని
శాస్త్ర వచనం.

మహారుద్రాభిషేకం:
భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు
మహా రుద్రాభిషేకం ఇష్టం.
మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి .

అతిరుద్రాభిషేకం:
ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’
సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది.
అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం,
ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి ,
బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు
ఆరోగ్య అభివృద్ధి.
స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు,
కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం,
నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.
శివాభిషేకంలో..మహన్యాసం, లఘున్యాసం, నమకం,చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా,
ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి.
మారేడు చెట్టునే బిల్వవృక్షమని,
శ్రీ వృక్షమని అంటారు.
కాని ఎండిపోయిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు.

ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు.
ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది.

బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది.
వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది.
నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు.

మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.
ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది.
జ్వరము హరిస్తుంది.
మూత్రరోగాలు నయం చేస్తుంది.
గుండె దడ నివారిస్తుంది.
విరేచన మందం పోగొడుతుంది.
దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది.
పండు రసం పుండ్లను మాన్పుతుంది.

రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు,పశుపతి, ఈశానుడు, మహాదేవుడు,
ఇలా శివునకు ఎన్నేన్నో నామాలున్నాయ.
వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చి తీరుతాడు.

అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితే చాలు శివసాయుజ్జం లభించినట్లే.
ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది.

సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి
ఈ పంచకృత్యాలు.
భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు
ఇటు దానవులే కాదు
శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.

శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు.

ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది.
ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు.
ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.

About The Author