ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి …


మూడేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైందో ప్రియురాలు. తనను ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో పక్కా ప్రణాళిక రచించి అతడిపై యాసిడ్‌ దాడి చేసింది. అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా యాసిడ్‌తో గాయపరుచుకుంది. అయితే ఎట్టకేలకు ఆమె నేరం బయటపడి చివరకు కటకటాలపాలైంది.
దిల్లీలో వికాస్‌పురి ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ వ్యక్తి యువతితో పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిని దక్కించుకోవాలని యువతి ఓ పథకం రచించింది. జూన్‌ 11న తన ప్రియుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తూ.. మార్గమధ్యంలో తనను హెల్మెట్‌ తీయమని కోరింది. ఆ యువకుడు హెల్మెట్‌ తీయగానే వెనుకనుంచి యాసిడ్‌తో దాడి చేసింది. అనంతరం తనపై కూడా కొంత యాసిడ్‌ను చల్లుకుంది.
ఆ తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ‘ఎవరో మనపై యాసిడ్‌ విసిరి పారిపోయారు’ అంటూ అరిచింది. ఈ దాడిలో గాయపడిన వీరిద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా.. యువతికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. విచారణలో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఎక్కడా బయటి వ్యక్తులు యాసిడ్‌ దాడి చేసిన ఆనవాళ్లు కన్పించలేదు.
దీంతో పోలీసులు బాధితుడిని మరోసారి ప్రశ్నించారు. అయితే బైక్‌పై ఉండగా.. తనను హెల్మెట్‌ తీయమని యువతి చెప్పిందని, ఆ తర్వాతే దాడి జరిగిందని ఆ యువకుడు చెప్పారు. దీంతో పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆమెను అరెస్టు చేశారు.

About The Author