పెద్దల పంతంతో ప్రేమికుల ఆత్మహత్య…

తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న ఆవేదనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సీహెచ్‌.రామలింగేశ్వరరావు(21) బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం ప్రయత్నిస్తున్నాడు. అతడికి అడ్డతీగల హిజ్‌ కళాశాలలో డీఎడ్ చదువుతున్న సంధ్యా భార్గవి(19) కొంతకాలం క్రితం పరిచయమైంది.

వీరి పరిచయం ప్రేమగా మారడంతో లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి వ్యవహారం ఇరుకుటుంబాలకు తెలిసింది. దీంతో భార్గవిని మందలించిన తల్లిదండ్రులు చదువు పూర్తి కాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు రామలింగేశ్వరరావును కలవొద్దని పెద్దలు హెచ్చరించారు.

తమ ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం వారిద్దరూ పింజరికొండ వాగు సమీపానికి పురుగులమందుతో చేరుకున్నారు. ముందుగా పురుగుల మందు తాగిన సంధ్య బాధతో విలవిల్లాడగా రామలింగేశ్వరరావు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రియురాలి మృతిలో ఆవేదన చెందిన రామలింగేశ్వరరావు పింజరికొండ దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగేశాడు. స్థానికులు అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా శుక్రవారం ఉదయం చనిపోయాడు. అడ్డతీగల పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

About The Author