ఆత్మహత్యకు ముందు చివరి సెల్ఫీ – అతడిని కాపాడింది…


ఇటీవలి కాలంలో సెల్ఫీలు తీసుకోవాలనే మోజులో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. కానీ కేరళలో ఒక సంఘటన అందుకు విరుద్ధంగా జరిగింది. చనిపోవాలనుకున్న ఒక వ్యక్తి చివరిసారిగా అతను తీసుకున్న సెల్ఫీనే కాపాడింది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి భార్యతో విభేదాల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని రైల్వే ట్రాక్‌పై పడుకుని సెల్ఫీ దిగి నేను చనిపోవాలనుకుంటున్నాను అని స్నేహితులకు సందేశం పంపించాడు. వెంటనే అతని స్నేహితులు అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అతను పంపిన సెల్ఫీలో రైల్వేకు చెందిన పసుపు రంగులోని మైలు రాయి ఒకటి వారికి తారసపడింది. వెంటనే వారి మిత్రుల్లో ఒకరు రైల్వే అధికారుల వద్దకు వెళ్లి సమాచారం అందించగా ఆ మైలు రాయి ప్రదేశాన్ని గుర్తించారు. ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిదానంగా వెళ్లాలని సూచించి అతన్ని సురక్షితంగా కాపాడారు. అనంతరం రైల్వే పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి చిన్న చిన్న విషయాలకు తగాదాలకు దిగబోమని వారి నుంచి హామీపత్రం తీసుకుని వదిలిపెట్టారు.

About The Author