తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త…


జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 29వ తేదీన చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 12 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, 3 మంది తీవ్ర అనారోగ్య బారిన పడిన జర్నలిస్టుల దరఖాస్తుదారులకు చెక్కుల పంపిణీని ఈ నెల 29వ తేదీ శనివారంనాడు మధ్యాహ్నం 12-00 గంటలకు సమాచార భవన్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో అందజేస్తామని ఆయన తెలిపారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు.
ఇప్పటివరకు 208 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని, ఆయా కుటుంబాలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తున్నామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్ కే జి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న 144 మంది విద్యార్థులకు నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు. దీనితో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 78 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయము సంక్షేమ నిధి నుంచి అకాడమీ అందజేసింది అన్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల 75 లక్షల రూపాయలు సంక్షేమ నిధి ద్వారా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది.

About The Author