ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మృతి…


తమిళనాడులోని సెలైయ్యూరులో ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ న్యూస్‌ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేసే ప్రసన్న (39), ఆయన భార్య అర్చన (32)తో పాటు ఆయన తల్లి రేవతి (59) ఈ ప్రమాదంలో మృతి చెందారు. వారు సెలైయ్యూరులోని తిరుమంగై మన్నన్‌ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. షాట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఫ్రిజ్‌లోంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రసన్న దానిపై నీళ్లు పోయడానికి ప్రయత్నించాడని, అయితే, అందులోంచి విషపూరిత గ్యాస్‌ వెలువడినట్లు తెలుస్తోంది.
ఆ ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్క గదుల్లో ఉన్న వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా వారి ముగ్గురి మృతదేహాలు కనపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

About The Author