వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజన రద్దు…!

ఒకే కేటగిరి కింద టిక్కెట్ల జారీ

తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి యోచన

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి సంకల్పించారు. దీనిపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి.. త్వరలో పూర్తిస్థాయిలో ఏర్పాటు కానున్న ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది అమలులోకి వస్తే.. బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన అందరికీ సమానంగా స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లు మూడు కేటగిరీల్లో విభజించి కేటాయిస్తున్నారు. అత్యంత ప్రముఖులకు లిస్టు-1గా, ఇతరులకు స్థాయిని బట్టి లిస్టు-2గా టికెట్లు మంజూరు చేస్తున్నారు. సాధారణ సిఫార్సులను లిస్టు-3 కింద పరిగణిస్తున్నారు. అన్ని కేటగిరీలకు సిఫార్సు తప్పనిసరి కావడంతో రూ.500 కట్టాల్సిందే. లిస్టు-1 కింద టికెట్లు పొందిన భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడి లేకుండా నిదానంగా స్వామివారి దర్శనం చేయించడంతో పాటు తీర్థం, శఠారీ మర్యాదలు కల్పిస్తారు. వీరి తర్వాత లిస్టు-2 టికెట్లున్న వారిని ఆలయానికి అనుమతిస్తారు. వీరిని గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. అయితే.. స్వామివారిని దర్శించుకుంటూ వేగంగా ముందుకు కదలాల్సి ఉంటుంది. క్షణకాలమూ నిలబడటానికి అనుమతించరు. అనంతరం లిస్టు-3 బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను పంపించి.. మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు రకాలుగా విభజించడంపై విమర్శలున్నాయి.

About The Author