పబ్‌జీ గేమ్‌పై నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న.. గుజరాత్‌..!?


పబ్‌జీ దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ ఇది. ముక్కూమొహం తెలియకున్నా, ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ శత్రువులను చంపే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంటుంది. గేమ్ లో గరిష్టంగా వంద మంది ఆడొచ్చు. యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్‌లు, బంకర్ సదుపాయాలు ఉంటాయి. గెలిస్తే.. చికెన్ డిన్నర్లు కూడా ఉంటాయి. ఈ గేమ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఆడుతున్నారు. రోజులో ఏ సమయంలో చూసినా మూడు, నాలుగు కోట్ల మంది ఈ గేమ్‌ ఆడుతుంటారు. ఈ గేమ్ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది. గేమ్ ఆడకపోతే పిచ్చోళ్లం అవుతామన్న రీతిలో దానికి బానిస అయిపోయారు. కొందరైతే గేమ్ ఆడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరికొందరు ఎదుటివారిని చావబాదిన ఘటనలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ గేమ్ ఆడేవారిని ఉన్మాదిలా మార్చుతుందని చెప్పడంతో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా మన దేశంలోని గుజరాత్ రాష్ట్రం ఈ గేమ్‌పై నిషేధం విధించింది.

తాజాగా, జోర్డాన్ దేశం కూడా పబ్‌పై నిషేధం విధించింది. ఈ గేమ్‌ వల్ల పిల్లలు, యువత ఎక్కువ ప్రభావితం అవుతున్నారని, వారు చెడు దారిలో వెళ్తున్నారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్‌ను నిషేధిస్తున్నామని జోర్దాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గేమ్ వల్ల పిల్లలు, యువతలో హింసాత్మక ధోరణి పెరుగుతోందని, ఈ క్రమంలోనే ఈ గేమ్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఈ గేమ్‌ను ఎవరూ, ఎక్కడా ఆడకూడదని అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాక్, నేపాల్ ప్రభుత్వాలు కూడా ఈ గేమ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.

About The Author