ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది…


ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది… బెంగుళూరులో 15 ఏళ్ళ బాలిక అఘాయిత్యం..
ప్రేమ, దోమ వద్దు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, బుద్ధిగా చదువుకో.. అని హితవచనాలు పలికిన తండ్రి ఆ కూతురికి శత్రువులా కనిపించాడు. తండ్రి అన్న ప్రేమ కూడా లేకుండా ప్రియునితో కలిసి దారుణంగా గొంతు కోసి చంపి, ప్రమాదంలా చిత్రీకరించేందుకు పెట్రోల్‌ పోసి మంట బెట్టిన కూతురి నిర్వాకం తెలిసి బెంగళూరు ఉలిక్కిపడింది. రాజాజినగరలో దుస్తుల వ్యాపారి జయకుమార్‌ జైన్‌ది అనుమానాస్పద మృతి కాదు, మైనర్‌ కూతురు, ఆమె ప్రియుడు చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. దీంతో నగరంలోని జైన్‌ సమాజం తీవ్ర షాక్‌కు గురైంది. రాజాజినగరలో భాష్యం సర్కిల్‌లో బట్టల షాప్‌ నడిపే జయకుమార్‌ జైన్‌ (41) రాజాజినగర 5వ బ్లాక్‌ 7వ క్రాస్‌లోని నివాసంలో ఆదివారం ఉదయం మంటల్లో కాలిన స్థితిలో మరణించాడు.అతని 15 ఏళ్ల కూతురు, 18 ఏళ్ల బీకాం విద్యార్థి, ప్రియుడు ప్రవీణ్‌ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు.
ఆమె తల్లి, తమ్ముడు శనివారం ఊరికి వెళ్లగా రాత్రికి తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది. తాగి మత్తులోకి జారుకోగా ప్రియున్ని పిలిపించి కత్తితో తండ్రి గొంతు కోసి చంపింది. అనంతరం శవాన్ని బెడ్‌రూంలోంచి బాత్‌రూంకు తెచ్చి రక్తపు మరకలు పోవాలని కడిగారు. బెడ్‌రూంలో గోడలపై పడిన రక్తపు మరకలపై నీళ్లు పోసి శుభ్రం చేశారు. అయినా మరకలు పోలేదు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారే వరకు అనేక ప్రయత్నాలు చేశారు. తెల్లవారుజామున పెట్రోలు తెచ్చి మృతదేహం మీద వేసి నిప్పటించారు. ఆ మంటలు తగిలి బాలిక, ప్రవీణ్‌ కు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రవీణ్‌ పారిపోగా, బాలిక అగ్నిప్రమాదం జరిగిందని కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనాస్థలిని పరిశీలంచిన పోలీసులు బాలికను ప్రశ్నించారు. అర్థంకాని మాటలు చెప్పటంతో ఆమె ద్వారా ప్రవీణ్‌ను పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ ఎలా హత్య చేసిందీ వివరించారు.ఇద్దరి మధ్య ప్రేమకు అడ్డుపడుతున్న తండ్రిని కూతురు, ప్రవీణ్‌లు కలిసి హత్య చేసినట్లు వివరించారు. ఇంట్లో ఉన్న చాకుతో పాటు బయట నుండి తెచ్చిన మరో చాకుతో ఇద్దరు కలిసి హత్య చేశారన్నారు.

About The Author