భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు…

గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

About The Author