సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం… శ్రీ కేటీఆర్


రానున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపిన కేటిఆర్, స్థానిక టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు కంటోన్మెంట్ బోర్డు మరియు రక్షణ శాఖ పరిమితుల వలన మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కై వేల నిర్మాణం కోసం ఇప్పటికే అనేకసార్లు తమ పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు వస్తే నగర ప్రజలు ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే కీలకమైన స్కై వే రహదార్ల నిర్మాణం ముందుకు సాగుతుందన్నారు.

ఈరోజు తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ సాయన్నతో పాటు బోర్డు మెంబర్ల తో సమావేశమైన కేటీఆర్ గారు రానున్న కంటోన్మెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి సంబంధించి చర్చించారు. దీంతోపాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర రక్షణ శాఖ నిర్ణయాల్లో అలస్యం వలన కంటోన్మెంట్ సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయని బోర్డు సభ్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా రానున్న బోర్డు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం ఆయన చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి సరైన సహాకారం లభించడం లేదని ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సభ్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కంటోన్మెంట్ లోని డిఫెన్స్ హాస్పిటల్ ను విస్తరించి వంద పడకల ఆసుపత్రిగా మార్చి, పేదలకు మరింత వైద్య సేవలు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ముందుకు పోవడం లేదన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కంటోన్మెంట్ బోర్డు తో చర్చలు చేసినా, వారు అందుకు నిరాకరిస్తున్నరని బోర్డు మెంబర్లు తెలిపారు. ఒకవైపు స్కై వే లాంటి మౌలిక వసతుల సదుపాయాల కల్పనను అడ్డుకుంటున్న కంటోన్మెంట్, కనీసం పేదలకు వైద్య సదుపాయం అందిస్తామన్నా సహకరించడం లేదన్నారు. ఈవిషయంలో డిఫెన్స్ హాస్పిటల్ ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారి నుంచి ఉత్తరాన్ని మరోసారి రాయమని కోరుతామని కేటీఆర్ బోర్డు మెంబర్లకు తెలిపారు. దీంతోపాటు రామన్న కుంట చెరువులోకి మురికి నీరు రాకుండా డైవర్షన్ పైప్ లైన్ల నిర్మాణం కోసం రాష్ట్ర పురపాలక శాఖ రెండున్నర కోట్లతో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని దీనిపైన ఒకటి రెండు రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ అన్నారు.

పార్టీపరంగా క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కేటీఆర్ గారికి తెలిపారు. ఎన్నికలు పార్టీ గుర్తు తో జరిగితే మరింత మెజారిటీలతో విజయం సాధించడం ఖాయమన్నారు. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాస్తే బాగుంటుందని స్థానిక ఎమ్మెల్యే సాయన్న సూచించారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా తమ ప్యానల్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కంటోన్మెంట్లో మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే కేటీఆర్ గారికి తెలిపారు. సమావేశంలో మల్కాజ్ గిరి నుంచి పార్లమెంట్ కు పోటీచేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది మర్రి రాజశేఖర్ రెడ్డి తోపాటు టీఆర్ఎస్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు, కార్పోరేటర్ లాస్యనందితా, టియస్ టియస్ చైర్మన్ రాకేష్ చిరుమిల్లా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

About The Author