ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర…

 

రాయలసీమలో బ్రిటిషు వారిని ఎదిరించిన పాళెగాడు1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు. ఈయన పాలెగార్ మనవడు.

త్వరిత వాస్తవాలు: జననం, మరణం …

ప్రారంభ చరిత్ర

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషుప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.
నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడిగ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోటమొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.
నరసింహారెడ్డి దగ్గర ఓబళాచార్యుడు అను ఆస్థానకవి ఉండెడని తెలియుచున్నది. ఈ ఓబళాచార్యుడు ఆకాలమున కర్నూలు మండలమున ప్రసిద్దికెక్కిన కృష్టిపాటి వేంకటకవికిని నశ్యము నిమిత్తమై సంభాషణాత్మకముగా జరిగిన రెండు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ చాటుపద్యమణిమంజరిలో ఇచ్చియున్నారు.ఒకప్పుడు వేంకటసుబ్బయ్య కవి నరసింహారెడ్డి ఆస్థానమునకు వచ్చెను. రెడ్డి గారు ఆయనని సత్కరించి, కావ్యగాన మొనర్చవలసినదిగా ప్రార్ధించెను.

తిరుగుబాటు ప్రారంభం

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణంకొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయగు జయరామిరెడ్డి కాలములోనే అనగా క్రీ.శ.1800 లోనే అంగ్లేయులు నొస్సం సంస్థానమును లోబరుచొకొని, ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయలు భరణము ఏర్పాటుచేసిరి. క్రీ.శ. 1845 వరకు ఈ భరణము నరసింహారెడ్డి కు నచ్చుచుండెను. ఆసంవత్సరము నరసింహారెడ్డి తనకు రావలసిన భరణము కొరకై కోయిలకుంట్ల తహసిల్దారుకు తన భటునుని (కొందరు భటునుని కాక తన కొడుకు దొరసుబ్బయ్యను పంపెనని చెప్పుదురు) పంపెను. ఆ తహసిల్దారు అది ఈయకుండా నరసింహారెడ్డి పై దుర్భాషలాడెను.ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయము తెలిపెను. అది విన్న నరసింహారెడ్డి అట్టి అవమానము వినకుండా చచ్చుట మేలు అని తలంచెను. అప్పుడు అదే భటునితో నేనే వచ్చెదనని తహసిల్దారుకు కబురుపంపినాడు.

మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకుచెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.
1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయసైన్యమును దీసికొని, పట్టపగలు కోయిలకుంట్లపట్టణముపై దండెత్తెను. తహసీల్దారుని పట్టి తలకొట్టి, ధనాగారములోనున్న బొదెలవాడు హరిసింగు ను జంపి, దానిని దోచుకొని, కచ్చేరీ నంతయు దగ్ధము చేసి తహసిల్దారు శిరస్సును, హర్సింగు శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరనున్న నయనాలప్ప కొండ లో గల ఒక శివాలయము గుహలో దాచినాడు. కడపలో నున్న కలెక్టరునకును, పోలీసు సూపరిండెంటునకు ఈ హత్యావిషయము తెలిసి, అన్వేషణ ప్రారంభించిరి. వారు రెడ్డి ని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదనియు, బహుశ ఔకరాజగు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారములో నుంచిరి. అపరాధ పరిశోధకులు తరువాత శివలయములో నున్న శిరస్సులను కొనిగొనిరి. రెడ్డి గారి అనుచరులగు గోసాయివెంకన్న, ఒడ్డెఓబన్న అనువారలను బందించి సత్యమును కనుగొనిరి.
బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అటుపై, నరసింహారెడ్డి వేలకొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్‌ తో ఘోర యుద్ధము చేసెను. రెడ్డి తన సైన్యముంతయు నష్ఠముకాగా, నల్లమల కొండలలోనికి తప్పించుకొని పారిపోయెను. ఆంగ్లేయులు ఆతనిని పట్టుకొనుటకు ఎన్నియో ప్రయత్నములు చేసిరి.కాని ఫలించలేదు.
తరువాత జూలై 23న తేదీన మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి.1846 అక్టోబరు 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించ దలచెను.నరసింహారెడ్డి కడ ఒక వంటమనిషి ఉండెను.బ్రిటీషువారు ఆమెకు లంచమిచ్చి నరసింహారెడ్డి ని పట్టుకొనిరి. ఆవంట మనిషి నరసింహారెడ్డికి విపరీతముగా సారాయి పట్టించి ఆతని తుపాకీలో నీళ్ళు పోసి ఉంచినదట. ఆసమయములో నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్ల కు తెచ్చినుంచిరి.

వీర మరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.
కడప స్పెషల్ కమీషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాల వాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరి తీసింది. బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయ భ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిల కుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

About The Author