7రోజులు.. 64విమానాలు..14,800మంది..!


“`° విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

వారిని దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించిన భారత ప్రభుత్వం ఇందుకోసం 64 విమానాలను నడపాలని యోచిస్తున్నట్టు సమాచారం.

మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్టు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఎయిరిండియా, దాని అనుబంధ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక విమానాలను నడపనున్నాయన్నారు.

° ఆ 12 దేశాలివే…

యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బెహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్

° ఎక్కడి నుంచి ఎన్నెన్ని విమానాలు?

భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ నెల 7 నుంచి 13 మధ్య 64 విమానాలు నడపనున్న కేంద్రం. యూఏఈకు 10 విమానాలు, అమెరికా, యూకేలకు చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది.

అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్‌కు ఐదు, ఖతార్‌ నుంచి రెండు చొప్పున విమానాలు నడపనుందని సదరు అధికారి వెల్లడించారు.

వీటితో పాటు మలేషియా, బంగ్లాదేశ్‌లకు చెరో ఏడు, కువైట్‌, ఫిలిప్పీన్స్‌కు చెరో ఐదు చొప్పున, ఒమన్‌, బెహ్రెయిన్‌కు చెరో రెండు చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది.

మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, దిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11; మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో ఏడు, మిగతా రాష్ట్రాల నుంచి ఐదు చొప్పున విమానాలు నడుస్తాయని ఆయన వివరించారు.

ఈ ఏడు రోజుల కాలంలో 14,800 మంది భారతీయులు చేరుకుంటారనీ.. మిగతా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలను నడుపుతుందని మరో అధికారి తెలిపారు.

° ఎవరి ఖర్చులు వారివే..

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో మార్చి 25 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్‌ ఈ నెల 17 వరకు కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాల రాకపోకలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

దీంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాలు, నౌకాదళ ఓడల్లో తరలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానం (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌-ఎస్‌వోపీ) సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ నిన్న తెలిపింది.

ఎవరి ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

భారతీయులు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్‌ సౌకర్యాలు రాష్ట్రాలే ఏర్పాటుచేయాలని, ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని స్పష్టం చేసింది. “`

About The Author