ముద్దులొలికే చిన్నారీ.. ప్రియుడి కోసం కన్నతల్లే నిన్ను!


కన్నబిడ్డను కాపాడాల్సిన తల్లే ఆ చిన్నారిపాలిట మృత్యువుగా మారిందా? విశాఖ జిల్లా బారవానిపాలేనికి చెందిన బొద్దాన రమేష్‌కు మారికవలసకు చెందిన వరలక్ష్మితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. రమేష్‌ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి పాప సింధు శ్రీ(3) ఉంది. వరలక్ష్మి ప్రవర్తన భర్తకు అనుమానం కలిగేలా ఉండటంతో పెళ్లయినప్పటినుంచీ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త తనను వేధిస్తున్నాడంటూ జనవరిలో వరలక్ష్మి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గొడవలు తగ్గకపోవడంతో వరలక్ష్మి కుమార్తెను తీసుకుని భర్త నుంచి వేరుగా వచ్చేసింది. బోరవానిపాలేనికి చెందిన ప్రియుడు బోర జగదీష్‌రెడ్డితో కలిసి గత నెల 14నుంచి మారికవలస రాజీవ్‌ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈ నెల 1న పాప మరణించింది. అనారోగ్యానికి గురికావడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లామని, అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని వరలక్ష్మి తెలిపింది. రాత్రికి రాత్రే చిన్నారిని మారికవలస శ్మశానంలో పూడ్చిపెట్టారు.

బుధవారం మధ్యాహ్నం భర్తకు ఫోన్‌ చేసి పాప చనిపోయిందని చెప్పి ఫోన్‌ పెట్టేయడంతో ఆగ్రహించిన రమేష్‌ కుటుంబీకులు గురువారం వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో గొడవకు దిగారు. చిన్నారిని భార్య, మరో వ్యక్తి కలిసి హత్య చేశారని రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారించగా చిన్నారిని శ్మశానంలో పాతిపెట్టినట్టు చెప్పారు. పోలీసులు అక్కడికి వెళ్లి, పాప మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి వరలక్ష్మి, జగదీష్‌లను అదుపులోకి తీసుకున్నారు.

About The Author