వియత్నాం బోటు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్..!

కడప, జూలై 14: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ముడియం శ్రీధర్ భౌతికకాయం కడపకు చేరుకున్న సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి అకాల మరణం తీవ్ర విషాదకరమనన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మృతుడు శ్రీధర్ పనిచేసిన కంపెనీ తరపున అందించాల్సిన పరిహారం, సహాయ సహకారాలు, ఇతర అవసరమైన చర్యలు త్వరగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు గట్టి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట.. కడప ఆర్డీవో మురళి, కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్, అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
