న్యూడ్ వీడియోలతో బెదిరించి మహిళపై పలుమార్లు అత్యాచారం
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధ్యాయ నగర్ శ్రీనివాస టవర్స్లో నివాసం ఉంటున్న ఓ మహిళను, ఆమె న్యూడ్ వీడియోలు ఉన్నాయని బెదిరించి శ్రీనివాస టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి పలుమార్లు అత్యాచారం చేశాడు. తనతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రైమ్ నెంబర్ 251/2026 కింద కేసు నమోదు చేసి, నిందితుడు గంగాధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. సాయి లక్ష్మి
తిరుపతి నగరంలోని ఉపాధ్యాయ నగర్, శ్రీనివాస టవర్స్లో నివసిస్తున్న ఓ మహిళను న్యూడ్ వీడియోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస టవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. సాయి లక్ష్మి డిమాండ్ చేశారు.
బాధితురాలు తనపై లైంగిక దాడులతో పాటు, తనను మరియు తన పిల్లలను చంపేస్తానంటూ నిందితుడు బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం స్వాగతించదగ్గ చర్య అని ఆమె పేర్కొన్నారు.
మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి నేరాలకు పాల్పడే వారిని చట్టం ముందు కఠినంగా శిక్షించాలని, అలాగే శ్రీనివాస టవర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి గంగాధర్ రెడ్డిని వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళలు ఇలాంటి వేధింపులు, బెదిరింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని ఆమె సూచించారు.
